Published July 15, 2023 by

మట్టు - మర్యాద

పూర్వం ఒక ఊరిలో సుఖదాసు అనే పేద రైతుకు కుమారవర్ధనుడనే కుమారుడు ఉండేవాడు. చదువు పూర్తయ్యాక కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండవలిసిందని సుఖదాసు తన కుమారుడితో చెప్పాడు. దీంతో కుమారవర్ధనుడు మంచి కొలువుకోసం ప్రయత్నాలు చేశాడు. అతడు హర్షగుప్తుడనే వ్యాపారి వద్దకు వెళ్లాడు. హర్షగుప్తుడు మరొక వ్యాపారి రత్నాచారికి కుమారవర్ధనుడి గురించి సిఫారసు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమారవర్ధనుడు తర్వాత రత్నాచారిని కలిశాడు. సిఫారసు లేఖ ఉన్నప్పటికీ ప్రయాణం కారణంగా అతడి బట్టలు మురికిగా మారటం అతడు మాట్లాడే భాష కాస్త మొరటుగా ఉండటం రత్నాచారి గమనించాడు. అతడికి ఉద్యోగం ఇచ్చేదీ లేనిదీ తర్వాత చెబుతానని చెప్పాడు. తనకు ఇక ఉద్యోగం రాదని కుమారవర్ధనుడు అర్థం చేసుకున్నాడు.

తిరిగి హర్షగుప్తుడి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పాడు కుమారవర్ధనుడు. ఉద్యోగాన్ని ఆశించి వెళ్లేటప్పుడు చక్కటి, శుభ్రమైన దుస్తులను ధరించి వెళ్లాలని, మృదువుగా మాట్లాడాలని, భాషలో తప్పులు లేకుండా చూసుకోవాలని హర్షగుప్తుడు సలహా ఇచ్చాడు. మనుషులు తమను తాము ఎలా ప్రదర్శించుకోవాలో అతడు కుమార వర్ధనుడికి సూచించాడు. మనిషి మాట్లాడే ప్రతి మాటనూ ప్రపంచం అంచనా వేస్తుంటుందని తెలిపాడు. ఈసారి అతడు సుమంగళుడు అనే మరొక వ్యాపారవేత్తకు సిఫారసు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమారవర్ధనుడు తనకు హర్షగుప్తుడు ఇచ్చిన సూచనలను తుచ తప్పకుండా పాటించాడు. సుమంగళుడి వద్ద కార్యదర్శి పదవి సంపాదించాడు కూడా. లోకంలో మర్యాద మన్ననలకు ఉన్న విలువ ఏమిటో అతడు అర్థం చేసుకుని హర్షగుప్తుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

Read More
Published July 15, 2023 by

రహస్యం

పెసరపాడు గ్రామాధికారి భూషయ్య ఏడేళ్ళ కూతురు కమల తండ్రి వద్దకు వచ్చి, 'నాన్నా, రహస్యం అంటే ఏమిటి?’ అనడిగింది. 'ఎందుకూ?' అనడిగాడతను. కమల తన స్నేహితురాలు వనజ ఇంట్లో ఆడుకుంటూంటే, ఒకావిడ వచ్చి వనజ తల్లితో, ఏదో చెప్పబోయింది. అప్పుడు వనజ తల్లి పిల్లలతో, ‘రహస్యాలు పిల్లలు వినకూడదు. బైటకు వెళ్ళి ఆడుకోండి,' అంది.

'సమాచారం, రహస్యం అంటే ఏమిటి నాన్నా?' అనడిగింది కమల. భూషయ్య ‘వాటి అర్థం తరువాత చెబుతాను కాని, ముందు నువ్వు రచ్చబండ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వారందరితోనూ సాయంత్రం నేను మామిడితోపు దగ్గరకు రమ్మన్నానని చెప్పిరా,” అన్నాడు. కమల వెంటనే పరుగెత్తుకు వెళ్ళి చెప్పి వచ్చింది.

కాసేపటి తరువాత భూషయ్య కొబ్బరితోటకు వెళ్తూ కూతుర్ని కూడా రమ్మన్నాడు. త్రోవలో ఓ ఇంటి వద్ద ఆగి, ఆ ఇంటి ఆసామీని పిలిచాడు. అతను బైటకు రాగానే, గొంతు తగ్గించి, ‘వచ్చే నెలలో పెసర వెల పెరగబోతున్నట్టు సమాచారం అందింది. తొందరపడి నీ పంటంతా చవగ్గా అమ్మేయకు. ఈ సంగతి ఎవరికీ చెప్పకు' అన్నాడు భూషయ్య.

కొంతదూరం వెళ్ళాక మరో వ్యక్తి కనిపిస్తే అతన్ని పక్కకు పిలిచి, ముందు వ్యక్తికి చెప్పినట్టే చెప్పాడు భూషయ్య. త్రోవ పొడవునా మరో అరడజనుమందికి అలాగే చెప్పాడు.

అదంతా గమనిస్తూన్న కమల విస్తుపోతూ, అదేంటి నాన్నా, ఎవరికీ చెప్పొద్దంటూ అందరికీ నువ్వే చెప్పేసావు?' అనడిగింది. భూషయ్య నవ్వి, 'రహస్యమంటే ఇదేనమ్మా. ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్కరికే చాటుగా చెప్పేదే రహస్యం!' అన్నాడు. 'సమాచారమంటే బాహాటంగా పదిమందికీ తెలియపరచేది. నువ్వు రచ్చబండకు వార్త మోసుకుపోలా? అదన్నమాట.'

'రహస్యమంటే ఇదా!' అంటూ బుర్ర గోక్కుంది కమల. భూషయ్య నవ్వి, కొబ్బరిబొండాలు దింపించి తీయటి కొబ్బరినీటిని కమలకు ఇప్పించాడు.

Read More
Published July 15, 2023 by

పనికిరాని సాధనం

ఒక కుందేలు ఒక కొక్కిరాయి వద్దకు వచ్చి, 'నీవు కట్టుడు పళ్లు బాగా కడతావుట. నాకు రెండు మంచి దంతాలు కట్టు, అన్నది.


'నీ పళ్లన్నీ బాగానే ఉన్నాయే,' అన్నది కొక్కిరాయి.

‘బాగా లేవని కాదు. నాకు ఇంకా పొడుగైన కోరలు. సింహం కోరల్లాంటివి కావాలి',

అన్నది కుందేలు.

‘దేనికీ?’ అని కొక్కిరాయి అడిగింది.


‘నక్కను భయపెట్టడానికి, దానితో వేగలేకుండా ఉన్నాను. దాన్ని చూసినప్పుడల్లా పారిపోవలసి వస్తున్నది. ఈ దెబ్బతో అదే నన్ను చూసి పారిపోవాలి' అన్నది కుందేలు.


కొక్కిరాయి తనలోనే నవ్వుకుని కుందేలుకు రెండు భయంకరమైన కోరలు అమర్చింది. కుందేలు అద్దంలో చూసుకుని, 'అద్భుతం! ఇప్పుడు చెబుతాను నక్క పని!’ అని నక్కను వెతుకుతూ బయలుదేరింది.


అది ఎంతో దూరం పోకుండానే ఒక పొద చాటున పొంచి చూస్తున్న నక్క కనిపించింది. కుందేలు అదురుకుని, శరవేగంతో కొక్కిరాయి వద్దకు తిరిగి వచ్చి, 'అన్నా, ఈ కోరలు తీసేసి, ఇంతకన్న భయంకరంగా ఉండేదేమైనా అమర్చగలవా?' అని అడిగింది.


‘మార్చవలసినది నీ దంతాలు కావు నీ పిరికి గుండె! దాన్ని తీసేసి గట్టిగుండె అమర్చినప్పుడు గాని, నీ సమస్య తీరదు,' అన్నది కొక్కిరాయి.


Read More
Published July 15, 2023 by

పనివాడు

రాఘవాపురంలో ఇరవై ఎకరాల ఆసామి రామచంద్రుడు. రామచంద్రుడిది సువిశాలమైన ప్రాంగణం మధ్యలో ఓ మోస్తరు ఇల్లు. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రకరకాల పూలమొక్కలు, పండ్ల చెట్లు పచ్చదనంతో కళకళలాడేవి. రామచంద్రుడి దగ్గర తోటమాలిగా ఉన్న వీరయ్య కాలం చేయడంతో కొత్త పనివాడు అవసరమయ్యాడు. ఇది తెలిసి ఒకరోజు ఉదయానే సీతయ్య, కాశయ్య అనే యువకులు ఆయన దగ్గరకొచ్చారు.

ఇద్దరి వివరాలనడిగిన రామచంద్రుడు, తాను ఒక ముఖ్యమైన పనిపై పట్నం వెళుతున్నానని, మరుసటి రోజు ఉదయం కనిపించమని చెప్పి తన గుర్రబ్బగ్గీ మీద వెళ్లిపోయాడు. సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి ఆయన ఇంటికి చేరాడు. ప్రధానద్వారం దగ్గర సీతయ్య మట్టిని సరిచేస్తూ దారికడ్డంగా అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న రాళ్లను ఏరి పారవేస్తూ కన్పించాడు. రామచంద్రయ్య బగ్గీని నిలిపి,' పైన ఎండ మండిపోతోంది. రేపు ఉదయాన్నే కనిపించమన్నానుగా. ఇక్కడేం చేస్తున్నావు!' అని అడిగాడు.

సీతయ్య వినయంగా లేచి నిలబడి 'అయ్యా! ఉదయం తమరు బగ్గీలో పోతున్నప్పుడు గుర్రం కాలు జారి ఇక్కడున్న చిన్న గుంతలో పడి బగ్గీ మొత్తం అదిరింది. ప్రమాదాలు చెప్పిరావు. అందుకే దానిని సరిచేస్తున్నానయ్యా!' అన్నాడు భయపడుతూ.

రామచంద్రయ్య ‘కాశయ్య నా మాటకు విలువనిచ్చి వెళ్లిపోయాడు. అదీ మంచి పనే. అయితే సీతయ్య నా క్షేమం కాంక్షించాడు. ఉపాధి కోసం చేసే పనిని ప్రేమించడంతో పాటు అన్నం పెట్టే యజమాని మేలు కోరేవాడే అసలు సిసలయిన పనిమంతుడు. ఇటువంటివారే చేసే పనిపట్ల నిబద్ధత, కలిగి ఉంటారు” అని ఆలోచించి సీతయ్యను తోటమాలిగా తీసుకున్నాడు.

Read More
Published July 15, 2023 by

బిచ్చగాడి నిధి

ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పని చేసి అలిసిపోయి, ఇంటికి వచ్చి, నడుము వాల్చి,‘ఓ దేవుడా! నాకొక చిన్న నిధి ఇవ్వలేవా?' అని ప్రార్థన చేశాడు.

అకస్మాత్తుగా అతని ముందొక సంచీ పడింది. మరుక్షణమే అతనికి ఇలా వినబడింది:‘ఈ సంచీలో నీకు బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణేలైనా దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక, ఈ సంచీని నదిలో పారెయ్యి, అయితే ఒక్కటి గుర్తుంచుకో, సంచీని నదిలో

పారేసేదాకా నువ్వా డబ్బును ఖర్చు చేయరాదు. అలా ఖర్చు చేశావో, నువు తీసిన డబ్బు యావత్తూ మాయమవుతుంది. '


రైతు పరమానందం చెంది, ఆ రాత్రల్లా సంచీలో నుంచి బంగారు నాణాలు తీసి, ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు. సంచీని నదిలో పారేసిన దాకా బంగారాన్ని వాడటానికి లేదు. ఇంకొక్క రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతం నింపి, తరువాత సంచీని నదిలో పారేద్దామనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోతాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి. రైతు రోజూ బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి చూసి ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కొద్దీ బంగారు నాణాలుండటం చూసి నిర్ఘాంతపోయారు.


Read More