Published July 15, 2023 by

మట్టు - మర్యాద

పూర్వం ఒక ఊరిలో సుఖదాసు అనే పేద రైతుకు కుమారవర్ధనుడనే కుమారుడు ఉండేవాడు. చదువు పూర్తయ్యాక కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండవలిసిందని సుఖదాసు తన కుమారుడితో చెప్పాడు. దీంతో కుమారవర్ధనుడు మంచి కొలువుకోసం ప్రయత్నాలు చేశాడు. అతడు హర్షగుప్తుడనే వ్యాపారి వద్దకు వెళ్లాడు. హర్షగుప్తుడు మరొక వ్యాపారి రత్నాచారికి కుమారవర్ధనుడి గురించి సిఫారసు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమారవర్ధనుడు తర్వాత రత్నాచారిని కలిశాడు. సిఫారసు లేఖ ఉన్నప్పటికీ ప్రయాణం కారణంగా అతడి బట్టలు మురికిగా మారటం అతడు మాట్లాడే భాష కాస్త మొరటుగా ఉండటం రత్నాచారి గమనించాడు. అతడికి ఉద్యోగం ఇచ్చేదీ లేనిదీ తర్వాత చెబుతానని చెప్పాడు. తనకు ఇక ఉద్యోగం రాదని కుమారవర్ధనుడు అర్థం చేసుకున్నాడు.

తిరిగి హర్షగుప్తుడి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పాడు కుమారవర్ధనుడు. ఉద్యోగాన్ని ఆశించి వెళ్లేటప్పుడు చక్కటి, శుభ్రమైన దుస్తులను ధరించి వెళ్లాలని, మృదువుగా మాట్లాడాలని, భాషలో తప్పులు లేకుండా చూసుకోవాలని హర్షగుప్తుడు సలహా ఇచ్చాడు. మనుషులు తమను తాము ఎలా ప్రదర్శించుకోవాలో అతడు కుమార వర్ధనుడికి సూచించాడు. మనిషి మాట్లాడే ప్రతి మాటనూ ప్రపంచం అంచనా వేస్తుంటుందని తెలిపాడు. ఈసారి అతడు సుమంగళుడు అనే మరొక వ్యాపారవేత్తకు సిఫారసు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమారవర్ధనుడు తనకు హర్షగుప్తుడు ఇచ్చిన సూచనలను తుచ తప్పకుండా పాటించాడు. సుమంగళుడి వద్ద కార్యదర్శి పదవి సంపాదించాడు కూడా. లోకంలో మర్యాద మన్ననలకు ఉన్న విలువ ఏమిటో అతడు అర్థం చేసుకుని హర్షగుప్తుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.